నిజామాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల ప్రచారానికి వరుసకట్టి వస్తున్న బీజేపీ నేతలకు ఇందూరు గడ్డపై పరాభవమే మిగులుతున్నది. సాక్షాత్తు ప్రధాని మోదీ పాల్గొన్న సభకే జనాల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండగా, ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభ పూర్తిగా వెలవెలబోయింది. గిరిరాజ్ కళాశాల మైదానంలో గురువారం బీజేపీ నిర్వహించిన ప్రచార సభకు జేపీ నడ్డా హాజరయ్యారు. ఆయన ప్రసంగం మొదలుపెట్టే సమయానికి మైదానంలో సగానికి పైగా కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. ఇదిచూసి నివ్వెరపోయిన నడ్డా దిక్కుతోచని స్థితిలో నాలుగు మాటలతోనే ప్రసంగాన్ని ముగించేశారు. సభలో జనాలే లేకపోవడంపై ఆయన స్థానిక లీడర్లపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. బీజేపీ నేతలంతా నాలుగైదు రోజుల నుంచి ఆపసోపాలు పడుతూ జనాలను తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. నవంబర్ 15న ఇదే మైదానంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రచార సభ జరిగింది. అత్యద్భుతంగా జరిగిన ఆ సభకు ప్రజలు పోటెత్తారు.
జనంలేని సభను చూసి నిరుత్సాహపడిన నడ్డా.. కొద్దిసేపే మాట్లాడినప్పటికీ అన్నీ అసత్యాలే వల్లించాడని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ర్టానికి చేసిన మేలును ఇసుమంతైనా వివరించలేదు. హిందీలో చేసిన ప్రసంగానికి ఇందూరు వాసులెవ్వరూ అంతగా స్పందించలేదు. ఆద్యంతం బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు మోపిన నడ్డా.. గాలి కబుర్లు, కల్లబొల్లి మాటలే చెప్పారు. చివరకు తమ మ్యానిఫెస్టోను సైతం సరిగా వివరించలేకపోయారు.