హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): వడ్డీరేట్లు పెరిగినప్పటికీ హైదరాబాద్ మహా నగరంలో రికార్డు స్థాయిలో గృహ విక్రయాలు జరిగాయి. 2022లో గణనీయమైన వృద్ధిరేటుతో రూ.4,984 కోట్ల విలువైన ఇండ్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2021తో చూస్తే 28 శాతం వృద్ధి కనిపించింది. అటు ఆఫీస్ స్పేస్ లీజింగ్లోనూ హైదరాబాద్ పరుగులు పెట్టింది. నిరుడు 6.7 మిలియన్ చదరపు అడుగుల వార్షిక కార్యాలయ లావాదేవీలు జరిగాయి. దీంతో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో మూడో స్థానం లభించింది. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ఫ్రాంక్ ఇండియా తాజాగా విడుదల చేసిన తమ 2022 వార్షిక నివేదికలో వెల్లడించింది. కాగా, 2022లో గత పదేండ్లలో ఎన్నడూలేనంత గృహ విక్రయాలు జరిగాయన్నది. ఇక దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల మార్కెట్లతో పోల్చితే హైదరాబాద్లో వాణిజ్య మార్కెట్ 12 శాతం వృద్ధిని కనబర్చింది.
పశ్చిమ హైదరాబాద్ ప్రాంతంలోని ఇండ్లకే అధిక డిమాండ్ ఉన్నది. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు కేంద్రీకృతమైన ప్రాంతాలలో గృహాలకు డిమాండ్ తగ్గట్లేదు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, మణికొండ, కూకట్పల్లి, రాయదుర్గం ప్రాంతాల్లో గిరాకీ అంతకంతకూ పెరుగుతున్నదని నైట్ఫ్రాంక్ చెప్పింది. కొత్త ప్రాజెక్టులు కూడా ఏడాది కాలంలో 23% పెరిగాయి. ఇదిలావుంటే రెసిడెన్షియల్ మార్కెట్లో 32 శాతం వృద్ధి నమోదైంది. నిరుడు ద్వితీయార్ధంలో 16,353 యూనిట్ల విక్రయాలు జరిగాయి.