హైదరాబాద్, జూన్30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ప్రతిష్ఠాత్మక నిట్, ఐఐటీల్లో సీట్లు కొల్లగొట్టారు. ఐఐటీ, నిట్, ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి సంబంధించి జాయింట్ సీట్ అలాకేషన్ అథారిటీ మొదటి జాబితాను శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలోని గురుకులాలకు చెందిన 247 మంది విద్యార్థులు మొదటి జాబితాలో సీట్లు సొంతం చేసుకున్నారు. వీరిలో 117 మంది గిరిజన సంక్షేమ విద్యార్థులు, 106 మంది సాంఘిక సంక్షేమ విద్యార్థులు, 24 మంది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యార్థులు ఉన్నారు. వీరికి ప్రీమియర్ ఐఐటీ, నిట్, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్టీఐల్లో సీట్లు దక్కాయి. గిరిజన గురుకులాలకు సంబంధించి 76 మంది ఐఐటీ, 36 మంది నిట్, ముగ్గురు ట్రిపుల్ ఐటీ, ఇద్దరు జీఎఫ్టీఐలో సీట్లు సాధించగా, సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచి 51 మంది ఐఐటీ, 43 మంది నిట్, ఇద్దరు ట్రిపుల్ ఐటీ, 10 మంది జీఎఫ్టీఐలో సీట్లు సాధించారు. ఏకలవ్య గురుకులాల నుంచి 14 మంది ఐఐటీ, నలుగురు నిట్, ఇద్దరు ట్రిపుల్ఐటీ, నలుగురు జీఎఫ్టీఐ సీట్లు పొందారు. కౌన్సెలింగ్లో ఇంకా ఐదురౌండ్ల్లు, 2 ప్రత్యేక రౌండ్లు ఉన్నాయి. కాబట్టి గురుకుల విద్యార్థులకు మరిన్ని సీట్లు లభించే అవకాశం ఉంది. గురుకుల విద్యార్థులు అధిక సంఖ్యలో ర్యాంకులు సొంతం చేసుకోవడంపై మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, గురుకులాల సెక్రటరీ డీ రోనాల్డ్ రోస్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందించారు.