సంగారెడ్డి, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : జాతీయ భద్రతకు అవసరమైన నేవీ ఆయుధ వ్యవస్థపై సంయుక్తంగా పరిశోధనలు చేసేందుకు భారత నావికాదళం, ఐఐటీ హైదరాబాద్ మధ్య ఒప్పందం కుదిరింది. భారత నావికాదళ వైస్ అడ్మిరల్ సందీప్ నైతానీ, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి ఒప్పంద పత్రాలపై ఈ నెల 9న ఢిల్లీలో సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. భారత నావికాదళానికి చెందిన నేవీ వెపన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ ఎస్టాబ్లిష్మెంట్.. ఐఐటీ హైదరాబాద్లోని టెక్నాలజీ రిసెర్చ్ పార్కులో కొత్తగా టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్(సీటీఐసీ)ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఐఐటీ హైదరాబాద్, భారత నావికాదళంతో ఒప్పందం కుదరడం సంతోషంగా ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నేవీ వెపన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ ఎస్టాబ్లిష్మెంట్తో ఐఐటీ హైదరాబాద్ కలిసి పనిచేస్తుందని తెలిపారు. ఐఐటీల్లోని నూతన సాంకేతిక నైపుణ్యాలను, పరిశోధనలను జాతీయ భద్రతకు ఉపయోగించడం తనకు గర్వంగా ఉందని చెప్పారు. కో-డెవలప్మెంటల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ జాతీయ భద్రతా అవసరాలను తీర్చడంతోపాటు భారత నేవీకి అవసరమైన అత్యుత్తమ ఆవిష్కరణలు చేపట్టేందుకు ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్లోని టెక్నాలజీ రీసెర్చ్ పార్కు ఫ్యాకల్టీ ఇన్చార్జి ప్రొఫెసర్ సుమోహన్ చెన్నప్పయ్య మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్, భారత నేవీ కలిసి జాతీయ భద్రతకు అవసరమైన కొత్త ఆయుధాలను ఆవిష్కరించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని తెలిపారు.