కాంగ్రెసోళ్లవన్నీ ఉత్తుత్తి డిక్లరేషన్లు. పనికిరాని డిక్లరేషన్లు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన సొంత రాష్ట్రం కర్ణాటకలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేక చతికిలపడ్డారు. ఆయన ఇక్కడికొచ్చి డిక్లరేషన్లు ఇస్తే, వాటికి విలువ ఉంటుందా? 2009 మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ అమలు చేయలేదని మరువొద్దు.
– మంత్రి హరీశ్రావు
Minister Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను ఓడించి, ఆ మహనీయుడికి భారతరత్న ఇవ్వకుండా చేసిందే కాంగ్రెస్ అని ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బాబూ జగ్జీవన్రాంను ప్రధాని కాకుండా అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల డిక్లరేషన్ను అమలు చేస్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. ‘ఎవరెన్ని ట్రిక్కులు చేసినా, ఎన్ని ట్రిప్పులు కొట్టినా, హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ది. బీఆర్ఎస్ పార్టీదే. ఇందులో ఎవరికీ అనుమానం లేదు. రాష్ట్రంలో ఏ మూలకు పోయి ఎవరిని అడిగినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంటే అని చెప్తరు’ అని తేల్చి చెప్పారు. ఆదిలాబాద్ నుంచి మహబూబ్నగర్, ఖమ్మం నుంచి మెదక్ వరకు ఎక్కడికి వెళ్లినా మళ్లా బీఆర్ఎస్ సర్కారే గెలుస్తదని ప్రజలు అంటున్నారని పునరుద్ఘాటించారు. కొల్లాపూర్ సహా తెలంగాణ అంతటా అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి గులాబీ జెండా ఎగురాల్సిందేనని స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాశ్రావు, ఆయన అనుచరులు మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. కాంగ్రెసోళ్లు దళిత, గిరిజనుల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని విమర్శించారు. దేశాన్ని, రాష్ర్టాన్ని 60 ఏండ్లు పాలించిన పార్టీ కాంగ్రెస్ దళిత, గిరిజనులకు ఏం చేసిందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ వెనుకబాటుతనానికి కారణమే కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు దళిత, గిరిజనుల మీద మాట్లాడే నైతిక హక్కులేదని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ దళితుల కోసం వైన్షాపుల్లో, కాంట్రాక్టుల్లో, ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్లు కల్పించటమే కాకుండా దేశమే అబ్బుపడేలా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని వెల్లడించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినా, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించినా కేసీఆర్తోనే సాధ్యమైందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ వస్తే ఎరువుల కొరతలు, కరెంట్ కోతలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటే వస్తదని, అందుకు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శమని హరీశ్రావు ఉదహరించారు. కాంగ్రెస్ వస్తే ఎరువుల కొరతలు, కరెంట్ కోతలు తప్పవని అన్నారు. ‘రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు మోటర్లు.. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండె. గంటగంటకు ట్రిప్పు అవుతుండే’ అని గుర్తుచేశారు. ఇవ్వాళ కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ వస్తున్నదని వెల్లడించారు. వలసల జిల్లాగా ముద్రపడిన పాలమూరును రివర్స్ మైగ్రేషన్ జిల్లాగా మార్చిన ఘనత కేసీఆర్దేనని వివరించారు. పాలమూరుకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి కూలీలు వస్తున్నరని పేర్కొన్నారు.
అసాధ్యాలను సుసాధ్యం చేసిన కేసీఆర్
అసాధ్యాలను సుసాధ్యం చేసి, గొప్ప విజయాలు సాధించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. రానేరాదన్న తెలంగాణను సాధిం చి, సాధించిన తెలంగాణను అన్నిరంగాల్లో అద్భుతంగా, ఆదర్శంగా ముందుకు తీసుకుపోతున్న గొప్ప దార్శనికుడు కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడైనా అనుకున్నమా? అని మంత్రి అడిగారు. కానీ ఇప్పుడు ఉమ్మడి పాలమూరులోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ‘రేపోమాపో పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభమై పరవళ్లు తొక్కబోతున్నది. ఈ సీజన్లో ఎత్తిపోతల పథకం నీళ్లు పారించబోతున్నాం’ అని సభికుల హర్షధ్వానాల మధ్య వెల్లడించారు. రాష్ట్రంలో రైతుకు గౌరవం, భూమికి విలువ తెచ్చిందే సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్ తెలిపారు. కేసీఆర్ వల్లే రైతులు బాగుపడ్డారని, బలోపేతమై అందరికీ చేతినిండా పని దొరుకుతున్నదని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోని కార్యక్రమాలు దేశానికి మార్గదర్శనం చేస్తున్నాయని వెల్లడించారు. తెలంగాణ ఎకరం అమ్మితే ఆంధ్రాలో వంద ఎకరాలు కొనొచ్చు అని చంద్రబాబు పేర్కొన్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో తిరిగి సీఎం కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు.
అభిలాశ్కు మంచి భవిష్యత్తు
బీఆర్ఎస్తోనే ప్రజలకు మేలు జరుగుతుందని పార్టీలో చేరిన రంగినేని అభిలాశ్రావుకు మంచి భవిష్యత్తు ఉంటుందని హరీశ్రావు అభయమిచ్చారు. బీఆర్ఎస్ కొల్లాపూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే హర్షవర్ధన్ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. హర్షవర్ధన్రెడ్డిని ఎంత మెజారిటీతో గెలిపిస్తే, అభిలాశ్కు అంతపెద్ద స్థానం లభిస్తుందని తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 14 స్థానాల్లో గులాబీ జెండా ఎగురబోతున్నదని చెప్పారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, సాట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, పార్టీ నాయకులు రఘువర్ధన్రెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్వి ఉత్తుత్తి డిక్లరేషన్లు
‘కాంగ్రెసోళ్లవన్నీ ఉత్తుత్తి డిక్లరేషన్లు. పనికిరాని డిక్లరేషన్లు అని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు, కర్ణాటక వాసి మల్లికార్జున ఖర్గే తన సొంత రాష్ట్రం కర్ణాటకలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేక చతికిలపడ్డారని విమర్శించారు. అటువంటిది ఇక్కడికి వచ్చి డిక్లరేషన్లు ఇస్తే, వాటికి విలువ ఉంటుందా? అని అడిగారు. ఎలాగూ అధికారంలోకి రాబోమనే, వాళ్లు నోటికొచ్చిన తీర్మానాలు, వాగ్దానాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2009 మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ అమలు చేయలేదని దుయ్యబట్టారు. తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని, రైతులకు 9 గంటలు పగటిపూట కరెంట్ ఇస్తామని, సిలిండర్ ధరలు తగ్గిస్తామని ఇలా ప్రజలకు అనేక వాగ్దానాలిచ్చి వాటిల్లో ఏ ఒక్క దాన్ని అమలు చేయలేదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాదు.. హామీ ఇవ్వని అనేక కార్యక్రమాలను అమలు చేశారని వివరించారు. కల్యాణలక్ష్మి, బీడి కార్మికుల పింఛన్లు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, రైతుబంధు, రైతుబీమా.. ఇలా అనేక పథకాలను బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టలేదని, అయినా అమలు చేశారని ఉదహరించారు.