జగిత్యాల : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా రాయికల్ మండల బోర్నపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు దంటిక రాజేశం, పొన్నం నరేష్, వెంగల రాజు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్(MLA Sanjay kumar )గులాబీ పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంట్ కోతలు తప్పవన్నారు. ఆరు గ్యారంటీలంటూ ఓట్ల కోసం వస్తున్న ఆ పార్టీ నేతలు వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదో ప్రశ్నించాలన్నారు. అలవి కానీ హామీలతో ఆ పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని విమర్శించారు.
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ మూడోసారి విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ కార్య క్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోల శ్రీనివాస్, సర్పంచ్ పాదం లత, ఎంపీటీసీ పెంద్రం కవిత, గ్రామ శాఖ అధ్యక్షుడు రవీందర్, నాయకులు రాగుల స్వామి, మాజీ సర్పంచ్ గంగారాం, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.