సంగారెడ్డి , నవంబర్ 17 : రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను అమ్ముకోవడం ఖాయమని అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్(MLA Kranthi Kiran ) అన్నారు. శుక్రవారం అల్లాదుర్గం మండలంలోని అప్పాజీపల్లి గ్రామంలోని శివాజీ యూత్, రజక సంఘం నుంచి 63 మంది బీజేపీ, కాంగ్రెస్ను వీడి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే రాయికోడ్ మండలం నల్లబల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రాభివృద్ధి జరగాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి రావాలని ప్రజలే కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మరని, ఆ గ్యారింటీలు కాదు.. 60 గ్యారెంటీలు ఇచ్చినా ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని గమనించే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రామాగౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెంటయ్య, నాయకులు రాజు, వెంకట్ తదితరులు ఉన్నారు.