జగిత్యాల : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మెచ్చి వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు గురువారం సుమారు 300 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అలవి కానీ హామీలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నదని విమర్శించారు. దేశం ఎదుర్కొటున్న అనేక సమస్యలకు కారణం అత్యధికాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. పేదేండ్ల బీజేపీ పాలన కూడా దేశం దివాళా తీసేలా చేసిందని మండిపడ్డారు.
ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ గెలువడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు కొత్త, పాత అనే తేడా లేకుండా కలిసికట్టుగా పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.