కుమ్రం భీం ఆసిఫాబాద్ : సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలో నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని సిర్పూర్కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో నాగంపేట్, కన్నెపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారని ప్రశంసించారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ గెలువడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, మీకు ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ రావు, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, దరి రాములు, తదితరులు ఉన్నారు.