Gadwal Girls High School | జోగులాంబ గద్వాల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు నూతనంగా తరగతి గదులను ప్రారంభించడం, అధునాతనంగా తీర్చిదిద్దడంతో ప్రతి విద్యార్థి సర్కార్ బడుల వైపే మొగ్గు చూపుతున్నారు.
ఈ క్రమంలో జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు భారీ డిమాండ్ వచ్చింది. అంచనాలకు మించి అడ్మిషన్లు అయ్యాయి. కొంత మంది విద్యార్థినులను వెయిటింగ్ లిస్టులో ఉంచారు. ప్రభుత్వ బాలుర పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గత సంవత్సరం కూడా భారీ స్థాయిలో అడ్మిషన్లు వచ్చాయి.
గతేడాది బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో కలిపి 982 మంది విద్యార్థినులు ఉన్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య 1,057కు చేరింది. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 20 మంది టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. 13 తరగతి గదుల్లో విద్యార్థినులకు బోధన అందిస్తున్నారు. ఇక 8వ తరగతి తెలుగు మీడియంలో 92 మంది, ఇంగ్లీష్ మీడియంలో 105 మంది, 9వ తరగతి తెలుగు మీడియంలో 94 మంది, ఇంగ్లీష్ మీడియంలో 79 మంది, 10వ తరగతి తెలుగు మీడియంలో 158 మంది, ఇంగ్లీష్ మీడియంలో 68 మంది విద్యార్థినులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన 11 రోజుల్లోనే తమ పాఠశాలలో అడ్మిషన్లు ఫుల్ అయ్యాయని పాఠశాల హెడ్మాస్టర్ రాజానందం తెలిపారు. ఇప్పటికే స్థాయికి మించి ప్రవేశాలు కల్పించామన్నారు. ఇకపై అడ్మిషన్లు లేవని, విద్యార్థినుల తల్లిదండ్రులు సహకరించాలని పాఠశాల గేటు వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిపుణులైన ఉపాధ్యాయులు, అద్భుతమైన సౌకర్యాల కారణంగా తమ పాఠశాలను విద్యార్థినులు ఎంచుకున్నారని తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే అడ్మిషన్లు అందుబాటులో లేవని జిల్లాలోని బాలికల ఉన్నత పాఠశాలలో బోర్డు పెట్టడం ప్రభుత్వ పాఠశాలలకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టమవుతోంది.