ఆదిలాబాద్, జూలై 17 ( నమస్తే తెలంగాణ) : యువత ఉద్యోగాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్లో మూతపడిన సిమెంటు పరిశ్రమ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విషయంలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆగస్టు చివరినాటికి స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. సిమెంటు పరిశ్రమ పునఃప్రారంభమైతే 5 వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎంపీ, ఎమ్మెల్యేలు పరిశ్రమ ప్రారంభ విషయాన్ని స్పష్టం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పది సంవత్సరాల నుంచి సిమెంటు పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నదని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతోపాటు కేటీఆర్ రాష్ట్ర పరిశ్రమల మంత్రిగా ఉన్న సమయంలో మంత్రులు, ఎంపీల బృందం కేంద్ర మంత్రులను కలిసి పలు వినతులు అందజేసినట్టు గుర్తుచేశారు. ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో ఆసక్తి చూపుతున్న బీజేపీ ఎమ్మెల్యే సీసీఐ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు కేంద్రం విశాఖ స్టీల్ప్లాంట్ ప్రారంభిస్తున్నదని, సీసీఐ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గతంలో ఆదిలాబాద్లో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, మాజీ మంత్రి హన్స్రాజ్ గంగారం సీసీఐని ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్పై విమర్శలు మానుకుని సీసీఐ పునఃప్రారంభం విషయంలో దృష్టి సారించాలని సూచించారు.