CM KCR | వీఆర్ఏల పిల్లలకు అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా వీఆర్ఏ వ్యవస్థ కొనసాగిందని సీఎం కేసీఆర్ అన్నారు. రతరాలుగా అతితక్కువ జీతంతో రైతుల కల్లాల వద్ద దైన్య స్థితిలో పని చేస్తూ వచ్చారని, మహారాష్ట్రలో తక్కువ జీతంతో పని చేస్తున్నారని అక్కడి బీఆర్ఎస్ నాయకులు తెలిపారని చెప్పారు.
తెలంగాణలో బీఆర్ఏల క్రమబద్ధీకరణ వీరంతా అభినందిస్తున్నారన్నారు. కొత్త ఉద్యోగాలు చేపట్టనున్న వీఆర్ఏలందరికీ శుభాభినందనలు తెలిపారు. పదో తరగతి అర్హత ఉన్న 10,317 మంది నీటిపారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో విధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ఇంటర్ అర్హత ఉన్న 2,761 మందికి రికార్డు అసిస్టెంట్ హోదాతో పని చేస్తారని, డిగ్రీ ఆపై విద్యార్హత ఉన్న 3680 మంది జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తారన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ పోస్టులకు అప్రూవల్ ఇచ్చిందని సీఎం తెలిపారు.
61 ఏళ్లు నిండిన 3797 మంది సంతానానికి మానవీయ కోణంలో ఉద్యోగాలు ఇస్తామన్నారు. వీఆర్ఏల జేఏసీ ఎంత త్వరగా లిస్ట్ అంత త్వరగా వారికి ఆర్డర్లు ఇస్తామని, వీఆర్ఏల పిల్లల విద్యార్హతలలను బట్టి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందన్నారు. మీ డిపార్ట్మెంట్లో బాగా పని చేసి మంచి పేరు, ప్రమోషన్లు తెచ్చుకోవాలని కోరుతున్నానన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఉత్తర్వులు ఇస్తే బాగుంటుందని భావించి సీఎస్ శాంతికుమారి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇవాళ జీవో జారీ చేశారని చెప్పారు. ప్రక్రియలో లీగల్ సమస్య తలెత్తకుండా జీవో రూపొందించిన వారికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.