నయీంనగర్, నవంబర్ 25: వరంగల్ నిట్లో ఉద్యోగాల జాతర సాగుతున్నది. గత ఆగస్టు నుంచి ఈనెల 24 వరకు వెయ్యి మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్టు నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. దేశంలోని వివిధ కంపెనీల వారు తరలివచ్చి ఇక్కడి విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఎంపిక చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
వరంగల్ నిట్లో మొత్తం 8 వేల మంది విద్యార్థులు ఉండగా, అందులో ఎంటెక్, బీటెక్ విద్యార్థులు 1,350 మంది ఉన్నారు. ఈ నాలుగు నెలల్లో వెయ్యి మంది ఉద్యోగాలు సాధించడం ఇదే తొలిసారని నిట్ డైరెక్టర్ వివరించారు. మరో నాలుగు నెలల్లో మిగతా వారు కూడా వివిధ కంపెనీలకు ఎంపిక కానున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ప్లేస్మెంట్లో ఓ విద్యార్థికి అత్యధికంగా రూ.88 లక్షల ప్యాకేజీ దక్కినట్టు ఎన్వీ రమణారావు తెలిపారు.