హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీని నిర్వీర్యం చేయడానికి ఉన్న అవకాశాలన్నింటినీ ప్రయోగిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఉపాధి హామీని ఎక్కువగా వినియోగించుకొనే తెలంగాణ లాంటి రాష్ట్రాలపై నిబంధనల పేరుతో పనిదినాలను తక్కువ చేయాలని కేంద్రం చూస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడుచుకుంటూ కూలీలకు భరోసా కల్పిస్తున్నది. తాజాగా ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులను ఆధార్తో లింక్ చేస్తేనే కూలి మొత్తం జమ చేస్తామని కేంద్రం షరతు విధించింది. తెలంగాణలో లింక్ చేసుకోనివారు అతి తక్కువ సంఖ్యలో ఉన్నారని గుర్తించారు. అత్యధిక రాష్ట్రాల్లో ఆధార్ లింక్ కానివారు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆధార్ లింక్ గడువును డిసెంబర్ 1 వరకు పొడగించింది.
దేశవ్యాప్తంగా 35 లక్షల మంది ఇంకా ఆధార్ కార్డును జాబ్ కార్డుతో లింక్ చేసుకోవాల్సి ఉండగా, ఇందులో తెలంగాణవారు 29,608 మంది ఉన్నారు. వీరి జాబ్ కార్డులకు కూడా ఆధార్ లింక్ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అస్సాంలో 15.59 లక్షల మంది, మధ్యప్రదేశ్లో 2.16 లక్షలు, రాజస్థాన్లో 2.57 లక్షలు, మేఘాలయలో 3.07 లక్షలు, నాగాలాండ్లో 3.36 లక్షలు, మహారాష్ట్రలో 1.94 లక్షలు, బీహార్లో 1.79 లక్షల మంది జాబ్ కార్డులు ఆధార్తో లింక్ కాలేదని గుర్తించారు. డిజిటల్ పేమెంట్స్లో భాగంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ద్వారా ఆధార్ బేస్డ్ పేమెంట్స్ సిస్టం (ఏబీపీఎస్) గత ఫిబ్రవరి 1 నుంచి ఆధార్ కార్డుతో లింక్ అయిన వారికే కూలి మొత్తాన్ని చెల్లిస్తామని ప్రకటించడంతో రాష్ట్రంలో దాదాపుగా కూలీలంతా ఆధార్ లింక్ చేసుకున్నారు. ఉపాధి కూలీల మొత్తాన్ని కేంద్రం బ్యాంకు అకౌంట్ ద్వారా చెల్లింపులు చేస్తుండేది. కానీ ఆ విధానం కంటే ఆధార్ నంబర్ ద్వారా చెల్లింపులు సులువైన విధానమని కేంద్ర భావిస్తున్నది.