Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం.’ ఇది స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తరచూ పలు వేదికలపై వల్లెవేస్తున్న మాట. ఇది నిజమా.. కాదా.. అన్న విషయం ఆయనకు తెలుసు.. రాష్ట్ర ప్రజలకూ తెలుసు, మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు అంతకన్నా బాగా తెలుసు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వేయలేదు. మరెలా సాధ్యమని నిరుద్యోగులే ప్రభుత్వ పెద్దలను నిలదీస్తున్నారు. సీఎం ఒక్కరే కాదు.. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఇదే విషయాన్ని పదేపదే చెప్తున్నారు. అసలు ఆయా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఎవరు, ఎప్పుడు విడుదల చేశారన్న విషయాన్ని మాత్రం పూర్తిగా మరిచిపోయారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 30 వేల ఉద్యోగాలను తామే భర్తీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా నిరుద్యోగులను ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రచార ఆర్భాటానికి తెరలేపారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. గత సీఎం కేసీఆర్ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు భారీ బహిరంగ సభలు ఏర్పాటుచేసి, హంగు ఆర్భాటాలతో, హైడ్రామా తలపించేలా సీఎం రేవంత్రెడ్డి ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు ఇచ్చి, నిరుద్యోగుల చెవులో పూలు పెట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వానిదే ఘనత
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 30 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే చెందుతుందన్న విషయం ప్రతి ఒక్కరి నిరుద్యోగికీ తెలుసు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటున్న సీఎం రేవంత్రెడ్డి అందుకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏ ప్రభుత్వంలో విడుదల అయ్యాయన్న ప్రశ్నలకు మాత్రం ఎక్కడా సమాధానాలు ఇచ్చుకోలేదు. గత ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషన్కు మాత్రం కొన్ని పోస్టులను కలుపుతూ మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. అందులో స్టాఫ్ నర్సులో 1,890 పోస్టులు, గ్రూప్-1లో 60 పోస్టులను కలిపి హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది.
2022లోనే నోటిఫికేషన్ల పరంపర
ప్రస్తుతం టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో వివిధ నియామక దశల్లో ఉన్న నోటిఫికేషన్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే విడుదలయ్యాయి. వాటిలో దాదాపు 18 ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-1లో 503 పోస్టులు, గ్రూప్-2లో 783 పోస్టులు, గ్రూప్-3లో 1,363తోపాటు 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులతో భారీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
247 పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 1.540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్స్ (ఏఈఈ) పోస్టుల భర్తీ కోసం 2022 సెప్టెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా నోటిఫికేషన్లు విడుదల చేసినప్పటికీ నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆయా ఉద్యోగాల నియామకప్రక్రియ కొనసాగుతూ వస్తున్నది.
ప్రస్తుతం గ్రూప్ పరీక్షల కోసం పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాత పరీక్షలు నిర్వహించడం కోసం టీఎస్పీఎస్సీ అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. వాస్తవం ఇలా ఉంటే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్నది. ఈ నిజనిజాలనూ ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నిరుద్యోగులు కోరుతున్నారు.