JNTU | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ సహా ప్రొఫెషనల్ కాలేజీలకు అఫిలియేషన్ల జారీ విషయంలో ఆధిపత్యపోరు నడుస్తున్నది. జేఎన్టీయూ వర్సెస్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ అన్నట్టుగా తయారయ్యింది వ్యవహారం. 2024-25 విద్యాసంవత్సరానికి జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు కోసం 220 కాలేజీలు దరఖాస్తులు సమర్పించాయి. వీటిలో ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కాలేజీలున్నాయి.
నిబంధనల ప్రకారం జేఎన్టీయూ నియమించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (ఎఫ్ఎఫ్సీ)లు ఈ కాలేజీల్లో ప్రత్యక్ష తనిఖీలు నిర్వహిస్తాయి. జేఎన్టీహెచ్ 18 బృందాలను నియమించగా.. ఇవి కాలేజీల్లో తనిఖీలు చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగానే జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపును జారీచేస్తుంది. మార్చి మొదటి వారం నుంచి తనిఖీలు చేపడతామని జేఎన్టీయూ ప్రకటించిన షెడ్యూల్ను కాలేజీల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. ముందుస్తు తనిఖీలేంటని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. దీంతో తనిఖీలు నిలిచిపోయాయి.
కాలేజీ వర్గాల వాదనలు ఇలా..
జేఎన్టీయూ వీసీ పదవీ కాలం మే నెలలో పూర్తికానున్నది. కొత్త వీసీ వచ్చినప్పుడే తనిఖీలు చేపట్టవచ్చు కదా! చాలా కాలేజీలు కోర్సుల విలీనానికి..సీట్ల పెంపునకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇంకా ఏఐసీటీఈ అనుమతులు, సీట్లను ఖరారు చేయలేదు.
అలాంటప్పుడు తనిఖీలు చేసి ప్రయోజనమేంటి?
ఫ్యాకల్టీ అసోసియేషన్ వాదనలు ఇవీ..
వాస్తవానికి కొత్త సీట్లు కేటాయించిన తర్వాతే జేఎన్టీయూహెచ్ తనిఖీలు చేపట్టాలి. ఇప్పటికే కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత ఉంది. ్ల ఉద్యోగుల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. జేఎన్టీయూ చర్యలను ఖండిస్తున్నాం.
జేఎన్టీయూ వర్గాల వాదనలు..
ఏఐసీటీఈ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ జనవరి 31తోనే ముగిసింది. గతంలో ఏప్రిల్ 15 తర్వాత ముగిసింది. ఈసారి దరఖాస్తుల స్వీకరణ ముందుగానే ముగియడంతో తనిఖీలను ముందుగానే చేపట్టాం. సీటీఈ ప్రకటించిన షెడ్యూల్ను అనుసరించే తనిఖీలు మొదలుపెట్టాం. ప్రస్తుతానికి తనిఖీలు నిలిపివేయమని ఆదేశాలొచ్చాయి. వాటిని పాటిస్తున్నాం.