హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూతోపాటు కాన్స్టిట్యుయెంట్ కాలేజీల్లో ఫీజుల పెంపు అమలుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పెంచిన ఫీజులను అమలు చేయడమా? లేక వాయిదా వేయడమా? అన్నదానిపై తేల్చుకోలేకపోతున్నారు. దీనిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోన్నట్టు జేఎన్టీయూ ఉన్నతాధికారులు తెలిపారు. జేఎన్టీయూ కూకట్పల్లి, కొండగట్టు, సుల్తాన్పూర్, మంథని, సిరిసిల్లతోపాటు తాజాగా ప్రారంభయ్యే వనపర్తితో కలుపుకొంటే మొత్తం 7 కాన్స్టిట్యుయెంట్ కాలేజీలున్నాయి. వీటిలో రెండేండ్ల నుంచి ఫీజులను పెంచుతున్నారు. బీటెక్ ఫీజును నిరుడు రూ.18 వేల నుంచి రూ.35 వేలకు.. ఈ ఏడాది రూ.50 వేలకు పెంచారు. అయితే ఈ పెంపును అమలు చేయడంపై సందిగ్ధత కొనసాగుతున్నది. ఈ ఏడాది పాత ఫీజులే అమలు చేయాలని తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నిర్ణయించినప్పటికీ ఇంకా జీవో వెలువడలేదు. దీంతో ఫీజుల పెంపు అమలుపై యూనివర్సిటీ అధికారులు తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం.
జేఎన్టీయూలో ప్రారంభించే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజును ఒక లక్ష రూపాయలుగా అధికారులు ఖరారు చేశారు. ఇక నుంచి జేఎన్టీయూలో ఏ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుకైనా ఇదే ఫీజు అమలవుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ ఫీజులకు టీఏఎఫ్ఆర్సీ నిర్ణయం వర్తించదని, కొత్త ఫీజులే ఉంటాయని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.