హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలలో అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ప్రక్రియను జేఎన్టీయూ ప్రారంభించింది. అఫిలియేషన్ కోసం ఇప్పటికే వర్సిటీ అధికారులు.. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 160 వరకు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రకాల ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలో నాణ్యమైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అఫిలియేషన్ల ప్రక్రియ చేపడుతున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. గత ఏడాదిలో మాదిరిగా కాకుండా ఈ సారి వీలైనంత త్వరలోనే అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. అఫిలియేషన్ పొందిన ఇంజినీరింగ్ కాలేజీల జాబితాలను ప్రభుత్వానికి పంపేందుకు ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు.
నిబంధనలు పాటించాల్సిందే..
జేఎన్టీయూ అఫిలియేషన్ పొందాలనుకొనే అన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు వంద శాతం విద్యా ప్రమాణాలు పాటించాల్సిందేనని రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. దేశ, విదేశాల్లోని ఐటీ రంగాల్లో విద్యార్థులు మంచి స్థానాల్లో స్థిరపడాలంటే నాణ్యమైన విద్య బోధన అందించాల్సిన బాధ్యత కాలేజీలు, వర్సిటీపైనా ఉన్నదని వీసీ కట్టా నరసింహారెడ్డి స్పష్టంచేశారు. విద్యాప్రమాణాలు పాటించే విషయంలో ఎలాంటి మినహాయింపులివ్వడం లేదని తెలిపారు.