Jitta Balakrishna Reddy | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పచ్చి సమైక్యవాది అని బీజేపీ నుంచి సస్పెండ్ అయిన జిట్టా బాలకృష్ణారెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీకి చెందిన యెండల లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా కిషన్రెడ్డి మాత్రం రాజీనామా చేయలేదని గుర్తుచేశారు. కిషన్రెడ్డికి తెలంగాణ కంటే పదవులే ముఖ్యమని ఎద్దేవా చేశారు. మూడు పర్యాయాలు పార్టీని నిర్వీర్యం చేసిన కిషన్రెడ్డికి మళ్లీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బీజేపీని హైదరాబాద్కే పరిమితం చేసిన ఘనత కిషన్రెడ్డిదేనని ఎద్దేవా చేశారు. భద్రాచలం రాముడి గుడిని అభివృద్ధికి చేయలేని అసమర్థ మంత్రి కిషన్రెడ్డి అంటూ మండిపడ్డారు.
మీడియాకు లీకులిచ్చి ఈటల రాజేందర్ బీజేపీని బలహీనపరిచారని దుయ్యబట్టారు. అమిత్షా, జేపీ నడ్డాను తిట్టిన రఘునందన్రావును కిషన్రెడ్డి సంకలో పెట్టుకుని తిరుగుతున్నారని, తనకంటే ముందు రఘునందన్రావు, ఈటల, ఏ చంద్రశేఖర్, రవీందర్నాయక్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హిందూత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ.. రాజాసింగ్పై సస్పెన్షన్ను ఎందుకు ఎత్తివేయడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ను సీఎం కేసీఆర్ అరెస్ట్ చేస్తారనే భయం బీజేపీకి పట్టుకున్నదని విమర్శించారు. ఎన్నికల తర్వాత ఇతర పార్టీలను చీల్చి తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నదని ఆరోపించారు.