హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : టీచర్ల హాజరును పటిష్ఠంగా నమోదు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ బడుల్లో జియో అటెండెన్స్ను అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో మొబైల్యాప్ ద్వారా జియో అటెండెన్స్ నమోదుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఆయా జిల్లాల డీఈవోలకు ఆదేశాలిచ్చారు. ఈ జిల్లాల్లోని ప్రభుత్వ మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో జియో అటెండెన్స్ను అమలుచేయాలని పేర్కొన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది హాజరును తప్పనిసరిగా నమోదుచేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. టీచర్లు, సిబ్బంది విధులకు హాజరై సెల్ఫీ తీయగానే ఫొటోతో సరిపోల్చుకొని, అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా వారు ఎక్కడున్నరో ఇట్టే గుర్తించవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా జియో అటెండెన్స్ మొబైల్ యాప్ను ప్రత్యేకంగా తయారుచేశారు.
18 జిల్లాల్లో బయోమెట్రిక్
ఇదివరకు బడుల్లో బయోమెట్రిక్ హాజరును అమలు చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2020 మార్చి నుంచి దీనిని నిలిపివేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచి బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిచేస్తూ ఆగస్టులో ఆదేశాలిచ్చారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జయశంకర్భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, నాగర్కర్నూల్, గద్వాల, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జనగాం, వికారాబాద్, జగిత్యాల జిల్లాల్లో అమలుచేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రం బయోమెట్రిక్ హాజరు లేదు. దీని స్థానంలో జియో అటెండెన్స్ అమలుకు ఉత్తర్వులిచ్చారు.
అమలు తీరిలా..