వర్ధన్నపేట, మార్చి 11: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యుత్తు సంస్కరణలు రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయని జపాన్కు చెందిన జైకా(జపనీస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్) సంస్థ ప్రతినిధి చిమోనేమోరి ప్రశంసించారు. తెలంగాణలో అమలవుతున్న నిరంతర ఉచిత విద్యుత్తుపై జైకా సంస్థ సర్వే నిర్వహించింది. శుక్రవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులను కలిసి 24 గంటల విద్యుత్తు సరఫరా, జైకా ఆర్థిక సహకారంతో ఎన్పీడీసీఎల్ ఏర్పాటు చేసిన 25 కేవీ విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ల పనితీరును చిమునేమోరీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2016-17లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్తు సంస్కరణలకు జైకా రూ.351 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిందని తెలిపారు. దీంతో ఎన్పీడీసీఎల్ 25 కేవీ విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆ రుణాన్ని ఎన్పీడీసీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాయిదాల్లో చెల్లిస్తున్నదని చెప్పారు.
100 కేవీ విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతో రైతులకు ఏవిధంగా మేలు జరిగిందనే విషయాన్ని రైతుల ద్వారా తెలుసుకొంటున్నట్టు తెలిపారు. గతంలో 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో ఇబ్బందులు ఏర్పడేవని, 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతో మెరుగైన విద్యుత్తు సరఫరా జరుగుతుందని రైతులు ఆమెకు వివరించారు. 24 గంటల విద్యుత్తు సరఫరాతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని తెలిపారు. కాగా, ఎన్పీడీసీఎల్కు జైకా ద్వారా మరింత ఆర్థిక సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చిమోనేమోరి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్తుశాఖ వరంగల్ రూరల్ డీఈ మల్లికార్జున్, ఎన్పీడీసీఎల్ ప్రాజెక్టు డీఈ జానకీరామ్రెడ్డి, ఏఈలు బీ దయాకర్, రాజశేఖర్, అజయ్, విద్యుత్తు శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.