హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర నూతన గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. తమిళిసై సౌందరరాజన్ రాజీనామాతో జార్ఖండ్ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్గా కూడా ఆయనకే అదనపు బాధ్యతలను అప్పగించారు. బుధవారం ఉదయం రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళవారం రాత్రి 8.20కి జార్ఖండ్ నుంచి బయల్దేరి రాత్రి 11.05 గంటలకు రాజ్భవన్కు చేరుకోనున్నారు. బుధవారం రాజ్భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే.. గవర్నర్గా రాధాకృష్ణన్తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
మాజీ గవర్నర్ తమిళిసై, ప్రస్తుత గవర్నర్ రాధాకృష్ణన్ మధ్య పలు అంశాల్లో సారూప్యత ఉన్నది. ఈ ఇద్దరు కూడా తమిళనాడుకు చెందిన వారే. ఇద్దరూ తమిళనాడు బీజేపీలో కీలక నేతలే. ఆరెస్సెస్ భావజాలం కలిగిన రాధాకృష్ణన్ రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. 1998, 1999లో కోయంబత్తూర్ నుంచి ఎంపీగానూ గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2014, 2019లో ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004 నుంచి 2007 వరకు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. తమిళిసై కూడా 2014 నుంచి 2019 వరకు బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిగా కొనసాగడం గమనార్హం.