హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘సర్ మీకు దొంగలు కావాలా? బాధితుల డబ్బు కావాలా? చాయిస్ మీదే. పట్టుబడ్డ మావాళ్లు ఎంత లూటీ చేశారు? రూ.33 లక్షలా, ఇదిగో తీస్కోండి..’ జార్ఖండ్లోని సైబర్ దొంగల గ్యాంగ్ లీడర్ రాచకొండ సైబర్ క్రైం పోలీసులతో జరిపిన సంభాషణ ఇది. ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించిన రాచకొండ పోలీసులు.. జార్ఖండ్ నుంచే తతంగమంతా నడుస్తున్నట్టు రహస్యంగా సమాచారం సేకరించారు. రెండు బస్సుల్లో అక్కడికి వెళ్లి రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బాధితుల డబ్బు కొల్లగొట్టిన 30 మందిని గుర్తించారు. వారందర్నీ అదుపులోకి తీసుకొని, హైదరాబాద్కు తిరిగి వస్తుండగా.. ఓ ఐదుగురు సభ్యుల గ్యాంగ్ లీడర్ పోలీసుల వద్దకు వచ్చి తమ వాళ్లను వదిలేయాలని అడిగాడు. కుదరదని, న్యాయబద్ధంగా చూసుకోవాలని పోలీసులు స్పష్టంచేశారు. దీంతో.. ‘సర్ మీరు కేసులు పెట్టి జైలుకు పంపితే బాధితులకు న్యాయం జరుగదు. బాధితులకు న్యాయం జరుగాలంటే మావాళ్లు కొట్టేసిన నగదును తిరిగి ఇచ్చేస్తా’ అని చెప్పాడు. ఫిర్యాదులను పరిశీలించి, సేకరించిన ఆధారాలతో ఆ ఐదుగురు రూ.33 లక్షలు కొట్టేశారని పోలీసులు గుర్తించారు. విషయం చెప్పటంతో ఆ ముఠా గ్యాంగ్ లీడర్ ఐదు నిమిషాల్లోనే డబ్బంతా తీసుకొచ్చి పోలీసుల ముందు పెట్టాడు. బాధితులకు న్యాయం జరుగాలన్న ఉద్దేశంతో ఆ డబ్బును రికవరీ చేసిన రాచకొండ పోలీసులు.. నేరాలకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మిగతా 25 మందిని నగరానికి తీసుకొచ్చి రిమాండ్కు పంపారు. దీనిపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.