హనుమకొండ, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్లో ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి ప్రాధాన్యతను తగ్గించి అసెంబ్లీ సెగ్మెంట్ను తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అత్త హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఇదే ప్రయత్నంలో ఉండగా.. తాజాగా ఇదే స్థానం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వేం నరేందర్రెడ్డి గ్రూపు రాజకీయాలు మొదలుపెట్టారు.
మంత్రి పొంగులేటి అల్లుడు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి కుమారుడు అర్జున్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు గ్రూపు రాజకీయాలు నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి తన కుమారుడు కృష్ణభార్గవ్ను ఇదే స్థానంలో ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీని సైతం పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభావం చేస్తున్నారని ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి వర్గం చెబుతున్నది. అసెంబ్లీ ఎన్నికలకు రెండున్నరేండ్ల ముందునుంచే పార్టీలో గ్రూపుల రాజకీయం ముదురుతుండటం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. భారత పౌరసత్వం లేకపోవడంతో పోటీచేయలేకపోయారు. చివరి నిమిషంలో కోడలు మామిడాల యశస్వినీరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇప్పించి పోటీలో నిలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు నెలలనుంచే ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, అత్త ఝాన్సీరెడ్డికి మధ్య అధికార పంచాయితీ మొదలైంది. ఝాన్సీరెడ్డి ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై పేపర్లు, టీవీల్లో వరుస కథనాలు రావడంతో ప్రభుత్వం విచారణ చేయించి. ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఈ పరిణామాల తర్వాత ఝాన్సీరెడ్డి పీసీసీ కమిటీలో ఉపాధ్యక్ష పదవిని తెచ్చుకున్నారు. యశస్వినీరెడ్డికి బదులుగా తానే ఎమ్మెల్యేగా పోటీ చేసేలా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నియమితులయ్యారు. పాలకుర్తి నియోజకవర్గంలో అసమ్మతి రాజకీయాల వెనుక మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఉన్నారని ఝాన్సీరెడ్డి వర్గం గుర్తించిన తర్వాత సమీకరణలు మారాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అల్లుడు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి కొడుకు అర్జున్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజకీయంలోకి దింపాలని ప్రణాళిక రచించారు.
ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా ఉంటున్న అసమ్మతి నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తాము ఫిర్యాదు చేస్తే.. మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురామిరెడ్డి అసమ్మతి నేతలకు మద్దతుగా ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారని ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి మరోసారి పీసీసీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
ముఖ్యమంత్రి సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి కూడా తన కుమారుడు కృష్ణభార్గవ్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2004లో వేం నరేందర్రెడ్డి టీడీపీ తరపున మహబూబాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజల్లో వ్యతిరేకతను సాకుగా చెప్పి అభ్యర్థిని మార్చే ప్రక్రియలో తన కుమారుడిని ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు వేం నరేందర్రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పాలకుర్తి నియోజకవర్గంలోని అసమ్మతి నేతలు మంత్రి పొంగులేటి వర్గంలో చేరకుండా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు రెండున్నరేండ్లు ముందుగానే అధికారపార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు పోటీగా మరో ముగ్గురు ప్రయత్నాలు చేస్తుండడంతో పాలకుర్తి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.