హైదరాబాద్: మానవళి మనుగడకు ప్రధాన కారణమైన వాతావరణ(Weather )మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కథనాలకు మీడియా రంగం(Media) తగు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ సహకారంతో, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యూజే), వ్యూస్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులకు వాతావరణ మార్పులు అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగే వర్క్ షాప్ గురువారం ప్రారంభమైంది.
ఈ సమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మానవ తప్పిదాలే ప్రకృతి వైపరీత్యాల రూపంలో సమాజం మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని తెలిపారు. వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియాపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అనంతరం యునైటెడ్ స్టేట్స్ కౌన్సెల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్(Jennifer Larson) మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులపై జర్నలిస్టులకే ఎక్కువ అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచ అభివృద్ధి గమనానికి ప్రధాన కారణమైన వాతావరణ మార్పుల పై మీడియా రంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.
వాతావరణ మార్పులు ప్రకృతి వైపరీత్యాలపై అప్రమత్తం చేసేందుకు జర్నలిస్టులు ఈ అంశంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్ ,టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ, ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్, వ్యూస్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భీమారావు, యూఎస్ కౌన్సిలేట్ సిపిఆర్ఓ బాసిత్, సీనియర్ పాత్రికేయురాలు పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.