హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): జీవన్దాన్ 2013 ప్రారంభమైందని, పదేండ్లలో 1200 మంది అవయవ దానం చేసినట్టు జీవన్దాన్ కోఆర్డినేటర్, నిమ్స్ నెఫ్రాలజిస్టు డాక్టర్ స్వర్ణలత చెప్పారు. గురువారం రవీంద్రభారతిలో జరిగిన ఆర్గాన్ డోనేషన్ డే సందర్భంగా ఆమె ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఒక్కో డోనర్ నుంచి కాలేయం, గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కార్నియా వంటి అవయవాలను సేకరిస్తారని చెప్పారు.
ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 4000 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ జరిపి, 4000 మందికి పునర్జీవం పోసినట్టు తెలిపారు. నిరుడు దేశంలోనే అత్యధిక సంఖ్యలో 194 డొనేషన్స్ రాష్ట్రంలో నిర్వహించినట్టు వివరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 126 డొనేషన్స్ జరిగినట్టు చెప్పారు. ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో ఇప్పటివరకు దాదాపు వెయ్యి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్టు చెప్పారు. ఒక్క ఉస్మానియాలోనే 620 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, 23 లివర్ ట్రాన్స్ప్లాంట్స్, 1 పాంక్రియా ట్రాన్స్ప్లాంట్ జరిగినట్టు వివరించారు. కిడ్నీల కోసం 2000 మందికిపైగా వెయిటింగ్ లిస్ట్లో ఉండగా, కాలెయం కోసం వెయ్యి మంది వెయిటింగ్లో ఉన్నారని వివరించారు.