హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ 2 పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పరీక్షలో ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చినట్టు విద్యార్థులు, నిపుణులు తెలిపారు. గణితం కాస్త కఠినంగా, ఫిజిక్స్ సులభంగా వచ్చినట్టు వెల్లడించారు. గణితంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ఎక్కువ సమయం పట్టినట్టు చెప్పారు. ‘గణితంలో 30 ప్రశ్నల్లో ఎనిమిదింటికి సమాధానాలు సౌకర్యవంతంగా రాశాను. మరో పది ప్రశ్నలు సులభంగా వచ్చాయి. మిగిలిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రాబట్టడానికి చాలా సమయం పట్టింది’ అని హైదరాబాద్లో జేఈఈ పరీక్ష రాసిన చేతన్ రెడ్డి తెలిపారు. ఫిజిక్స్లో ఎక్కువ ప్రశ్నలు సులభంగానే ఉన్నాయని విద్యార్థులు స్పష్టం చేశారు.
ఏడో తరగతి సిలబస్కు చెందిన ప్రశ్నలు అడిగారని తెలిపారు. ‘కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచే వచ్చాయి. ఆర్గానిక్, ఇనార్గానిక్కు సంబంధించి సమానంగా ప్రశ్నలు అడిగారు. జేఈఈ మెయిన్-2023 మొదటి సెషన్తో పోలిస్తే సెషన్-2 ప్రశ్నపత్రం సులభంగా ఉన్నది’ అని సిద్ధార్థ్ అనే విద్యార్థి పేర్కొన్నారు. ‘గణితం, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో మంచి మార్కులు రావొచ్చు. ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు వచ్చే అవకాశం ఉన్నది. టాపర్స్ 290కిపైగా మార్కులు సాధించవచ్చు. మధ్యస్థంగా చదివేవాళ్లకు 150కి పైగా, పూర్ స్టూడెంట్స్కు 60కి పైగా మార్కులు వస్తాయి’ అని శ్రీచైతన్య ఆల్ ఇండియా ఐఐటీ కోఆర్డినేటర్ ఎం ఉమాశంకర్ అభిప్రాయపడ్డారు. ఈ పరీక్షలను రాష్ట్రంలోని 16 పట్టణాల పరీక్షాకేంద్రాల్లో నిర్వహించారు.