హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 30 నుంచి మే 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనున్నది. పరీక్షను జూన్ 4న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ బ్రోచర్ను ఐఐటీ గువాహటి ఇటీవలే విడుదల చేసింది. ఇప్పటికే జేఈఈ మెయిన్1 పూర్తికాగా, ఏప్రిల్లో జేఈఈ మెయిన్2 నిర్వహించి, ఫలితాలు విడుదల చేస్తారు. ఈ రెండు పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కు అర్హత సాధిస్తారు. దీని ఫలితాల ఆధారంగా ఐఐటీల్లో నాలుగేండ్ల బీటెక్, బీఎస్, బీఆర్క్, ఐదేండ్ల డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో భాగంగా జూన్ 4న ఉదయం, మధ్యాహ్నం నిర్వహించే రెండు పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. ఈ రెండు పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలనే ప్రకటిస్తారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు కనీసం 8 పట్టణాలను ఎంపిక చేసుకొనే వెసులుబాటు ఉన్నది.
వారణాసి, ఖరగ్పూర్, రూర్కీల్లోని ఐఐటీల్లో బీఆర్క్ (ఆర్కిటెక్చర్)కోర్సులను నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) రాయాలి. జూన్ 18,19న జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్ ద్వారా ఏఏటీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 21న ఏఏటీ పరీక్ష నిర్వహించి, జూన్ 24న ఫలితాలను ప్రకటిస్తారు.