హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అందిస్తున్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) హాస్పిటల్కు అరుదైన జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (జేసీఐ) అక్రెడిటేషన్ లభించింది. గోల్డ్సీల్తో కూడిన అంతర్జాతీయ ధ్రువీకరణ పత్రాన్ని ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డికి జేసీఐ అందజేసింది. అమెరికా కేంద్రంగా పనిచేసే జేసీఐ ప్రతినిధులు.. హైదరాబాద్లోని తమ హాస్పిటల్ను ఐదురోజులపాటు సందర్శించి అక్కడ పాటిస్తున్న 1,300 అంతర్జాతీయ, వైద్య ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించినట్టు ఏఐజీ వర్గాలు తెలిపాయి. నిత్యం 600కుపైగా ఐపీ రోగులు, 2000కు పైగా ఓపీ రోగులు పూర్తిస్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యసేవలను పొందుతున్న తీరును జేసీఐ ప్రతినిధులు పరిశీలించినట్టు పేర్కొన్నాయి. రోగుల భద్రత, ఇన్ఫెక్షన్ కంట్రోల్, అనస్థీషియా, సర్జికల్ కేర్, మెడికేషన్ మేనేజ్మెంట్, పేషెంట్ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, అవగాహన తదితర ప్రాథమిక అంశాలన్నీ అంతర్జాతీయ ప్రోటోకాల్కు అనుగుణంగా ఉన్నట్టు గుర్తించి హాస్పిటల్కు అక్రెడిటేషన్ అందించినట్టు వెల్లడించాయి. తమ హాస్పిటల్ పాటిస్తున్న అంతర్జాతీయ ప్రమాణాలు, రోగుల భద్రత, నాణ్యమైన వైద్యం తదితర అంశాలకు జేసీఐ ఇచ్చిన అక్రెడిటేషన్ అరుదైన గుర్తింపు అని ఏఐజీ చైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. ఏఐజీకి జేసీఐ అక్రెడిటేషన్ లభించడం తెలంగాణ మెడికల్ హబ్కు గర్వకారణమని పేర్కొన్నారు.