జనగామ : జనగామ జిల్లాలో అద్భుతాలు ఆవిష్కరిస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని రకాలుగా జనగామ ఒక గ్రోత్ సెంటర్.. ఎవరూ ఊహించని అభివృద్ధిని చూస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ – వరంగల్ కారిడార్కు జనగామ కీలకం అని సీఎం తేల్చిచెప్పారు. జనగామ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.
జనగామ ప్రాంతానికి కూడా ఐటీ, పరిశ్రమలు, విద్యాసంస్థలు తరలివస్తాయి అని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్తో పాటు మరో 32 అభివృద్ధి కేంద్రాలు తయారవుతాయి. జిల్లా కలెక్టరేట్లు ప్రజలకు మంచి ఫలితాలు అందించాలి. రాబోయే రోజుల్లో అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. ఇతర రాష్ట్రాలు ఆశ్చర్యపోయేలా అభివృద్ధి జరుగుతోంది. ధనికులైన ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారని చెప్పుకునే రోజులు వస్తాయన్నారు. భవిష్యత్లో ఎవరూ ఊహించని అభివృద్ధిని చూస్తామన్నారు.
జనగామలో భూముల విలువలు పెరిగాయి. ఏడేండ్ల కింద రూ. రెండు లక్షల విలువన్న ఎకర భూమి.. ఇప్పుడు రూ. రెండు, మూడు కోట్లకు చేరింది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఎకర పొలం రూ. 25 లక్షలకు తక్కువ పోతలేదు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధ్యమైంది. అధికారులు కూడా రాత్రింబవళ్లూ కష్టపడి పని చేశారు. సీఎస్, అధికారులు, ప్రజాప్రతినిధులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను.
మన ప్రజల తలసరి ఆదాయం త్వరలో రూ. 2.70 లక్షలు కానుంది. రాష్ట్రంలో సదుపాయాలు బాగున్నందునే అంతర్జాతీయ సంస్థలు తరలివస్తున్నాయి. శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఎందరో హైకోర్టు న్యాయమూర్తులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు హైదరాబాద్లోనే స్థిరపడిపోతున్నారు. రూ. 30 కోట్ల విలువ చేసే విల్లాలు కొనుగోలు చేస్తున్నారు అని సీఎం తెలిపారు.