Rainfall | హైదరాబాద్ : తెలంగాణలో నైరుతి రుతుపవనాలతో పాటు అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఆయా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని జనగామ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జనగామ జిల్లా గూడురులో 136.5 మి.మీ., భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాలలో 121.5 మి.మీ., ములుగు జిల్లా మంగపేటలో 119.0, కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గాయిలో 118.0, సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో 116.3, కరీంనగర్ జిల్లా కాశీంపేటలో 115.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువొచ్చని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
గురువారం జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువొచ్చని చెప్పారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.