జనగామ చౌరస్తా, మార్చి 20 : ‘కనికరించండి సార్.. మా పొట్టకొట్టొద్దు’ అంటూ శుక్రవారం జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కాళ్లు పట్టుకుని వేడుకున్నారు దళిత దంపతులు పాలమాకుల చిన్న మంజుల, కనకయ్య. ఇందిర మహిళా శక్తి పథకంలో భాగంగా జనగామ కలెక్టరేట్కు సమీపంలో ఆరు నెలల క్రితం అధికారుల సూచన మేరకు పాలమాకుల చిన్న మంజుల వనిత టీ స్టాల్, పొత్కనూరి విజయలక్ష్మి విజయ మిల్క్ పార్లర్ను ఏర్పాటు చేసుకోగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు వాటిని తొలగించడానికి రెవెన్యూ, మున్సిపల్, డీఆర్డీఏ, పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. గత్యంతరం లేక బాధితులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ ఒకటిన ఈ కేసు విచారణ వచ్చే వరకు వాటిని తొలగించొద్దంటూ హైకోర్టు న్యాయమూర్తి ఈ నెల 18న స్టేటస్కో జారీచేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ వనిత టీ స్టాల్లో తనిఖీలు నిర్వహించారు. అంతగా చదువురాని చిన్న మంజులతో ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకొని కలెక్టర్ వద్దకు వెళ్లినట్టు బాధితులు రోదించారు. రోజుకో విధంగా అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని, తమ బతుకుదెరువును కాపాడాలంటూ వారు నేరుగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలిసి కాళ్లమీద పడి బతిమాలాడుకునే ప్రయత్నం చేశారు.
జనగామ కలెక్టరేట్కు సమీపంలో వనిత టీ స్టాల్, విజయ మిల్క్ పార్లర్ను ఏర్పాటు చేసుకున్న దళిత, బహుజన బిడ్డలు పాలమాకుల చిన్న మంజుల, పొత్కనూరి విజయలక్ష్మిపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేధింపులు సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బొట్ల శేఖర్ అన్నారు. అధికార యంత్రాంగం తన చేతిలో ఉన్నదని, కలెక్టర్ రోజుకో విధంగా అధికారులను వనిత టీ స్టాల్, మిల్క్ పార్లర్ వద్దకు పంపించి తనిఖీల పేరిట భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వారి వ్యాపారం జరగకుండా అడ్డుకోవడం సరికాదని సూచించారు.