జనగామ, జనవరి 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. జనగామ జిల్లాలో ఈ పథకాన్ని మార్చి నుంచి అమలు చేస్తామని వెల్లడించారు. సోమవారం జనగామ కలెక్టరేట్లో కలెక్టర్ శివలింగయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, జడ్పీచైర్మన్ సంపత్రెడ్డితో కలిసి దళితబంధు, కరోనా, పంట నష్టంపై అధికారులతో సమీక్షించారు. తొలి విడత జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 300 దళిత కుటుంబాలకు లబ్ధికూరుతుందని చెప్పారు. ఈ పథకం అమలు, లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీలు వేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలంతా సమాన అవకాశాలతో ఆర్థికంగా ఎదగాలని.. తద్వారా బంగారు తెలంగాణ సాకారమవుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. కరోనా నియంత్రణలో ఉమ్మడి వరంగల్ పరిధిలోని జిల్లాలు మెరుగైన స్థానాల్లో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. పంట నష్టాల అంచనా పూర్తయిందని.. త్వరలో పరిహారం అందుతుందని స్పష్టంచేశారు.