Sammakka Saralamma Jathara | తాడ్వాయి : సమ్మక్క తనయుడు కన్నెపల్లిలో కొలువైన జంపన్న గద్దెపైకి చేరుకున్నాడు. కన్నెపల్లి నుంచి మంగళవారం రాత్రి 7.09 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటల ప్రాంతంలో వాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి చేరుకున్నాడు.
పూజారి పోలెబోయిన సత్యం కన్నెపల్లిలోని ఇంటిలో పూజా సామగ్రిని శుద్ధి చేసిన అనంతరం జంపన్న గద్దెకు అలుకుపూతలు నిర్వహించి ఆయన ప్రతిరూపమైన డాలు, కర్రకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం డోలువాయిద్యాల నడుమ రాత్రి 7.09 గంటలకు పూజారి సత్యం జంపన్న డాలు, కర్రతో గద్దెపైకి బయలుదేరాడు. ఆయన వెంట జంపన్న వడ్డె సాంబశివరావు, హనుమంతుడు డాలుతో రక్షణగా ముందు నడవగా గ్రామ మహిళలు ఊరు పొడవునా నీళ్లారబోస్తూ జంపన్నను సాగనంపారు. గ్రామ యువత దేవుడిని గద్దెపైకి చేర్చేందుకు ముందుండి నడిపించారు. బుధవారం సారలమ్మ గద్దెలపైకి చేరే క్రమంలో తమ్ముడు జంపన్నను జంపన్నవాగులో పలుకరిస్తూ గద్దెను చేరుకోనుంది. మూడు రోజుల పాటు గద్దెపై కొలువుదీరి కోటి మంది భక్తుల పూజలు అందుకుని తిరిగి శనివారం జంపన్నను పూజారి తిరుగువారం పండుగను నిర్వహించి కన్నెపల్లిలోని గుడిలోకి తీసుకెళ్లనున్నారు.