భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని మర్కోడు- పెద్దూరు మధ్య జల్లేరువాగు ఇదీ. పెద్దూరు అవతల సందిబంధం, చీమల గుంపు, నడిమిగూడెం, బోడాయి కుంట, ఈదుళ్ల, అడవిరామవరం, జాకారం, లొద్దిగూడెం అనే గిరిజన గ్రామాలు ఉంటాయి. ఆయా గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే ఈ వాగు దాటాల్సిందే. ప్రతి పనికీ రైతులు, పురిటి నొప్పులు వస్తే ప్రసవం కోసం గర్భిణులు, ప్రాథమిక పాఠశాలలు దాటిన ప్రతి విద్యార్థి ఉన్నత పాఠశాల కోసం వానకాలంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటాల్సిందే. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు కూడా. ఇదీ ఉమ్మడి పాలనలో సరైన రోడ్ల సదుపాయం కూడా లేని దైన్యం.
స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కార్ ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మర్కోడు- పెద్దూరు మధ్య జల్లేరువాగుపై వంతెన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 2018లో రూ.2.30 కోట్ల కేటాయించింది. 2019లో నిర్మాణం పూర్తయింది. 2020లో ప్రారంభమైంది. ప్రజల దశాబ్దాల కష్టాలకు పరిష్కారం లభించింది. ఇదీ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ధైర్యం.