హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు ముంపు తదితర అంశాలపై నివేదిక అందజేసేందుకు రెండు నెలల గడువు ఇవ్వాలని కేంద్ర జల్శక్తిశాఖ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేసింది. పోలవరం ప్రాజెక్టు, బ్యాక్వాటర్ ఎఫెక్ట్, ముంపు తదితర అంశాలపై పలు అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇంతకుముందే కేంద్రానికి స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది.
ప్రాజెక్టుపై అన్ని రాష్ర్టాలతో ఏకాభిప్రాయాన్ని సాధించాలని, అందుకు ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించింది. ప్రాజెక్టు సాంకేతిక అంశాలపై కూడా పూర్తిస్థాయి రిపోర్టును అందజేయాలని సూచించింది. ఈ ఆదేశాలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ముఖ్యమంత్రుల స్థాయి సమావేశాన్ని మాత్రం నిర్వహించలేదు. ఇటీవల ఆ దిశగా చర్యలు చేపట్టినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల గడువు ఇవ్వాలని కోరుతూ తాజాగా కేంద్ర జల్శక్తిశాఖ విజ్ఞప్తి చేసింది. సీఎంల స్థాయి సమావేశ నిర్వహణకు సంప్రదింపులు కొనసాగుతున్నాయని వివరించింది. ఈ కేసుపై విచారణ మంగళవారం కూడా కొనసాగనుంది. అటు.. పోలవరం బ్యాక్వాటర్ ముంపు జాయింట్ సర్వేకు వెంటనే చర్యలు చేపట్టాలని ఏపీకి పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖ రాసింది.