హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మించనున్న ఆరు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ విజప్తి చేశారు. కృష్ణా, గోదావరీ నదీ యాజమాన్య బోర్డులకు సంబంధించి గతంలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లోని పలు అంశాలపై తెలంగాణ, ఏపీ సీఎస్లతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గతేడాది అక్టోబర్లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఐఎస్ఆర్డబ్ల్యూడీలోని 1956 చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ట్రైబ్యునల్కు రిఫర్ చేయడానికి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి తెలంగాణ సీఎంను కోరారని, ఇందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు నుంచి కేసును ఉపసంహరించుకుందని సీఎస్ తెలిపారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని కార్యదర్శి కోరారు.
అయితే, ఈ అంశానికి సంబంధించి భారత ప్రభుత్వ న్యాయశాఖ అభిప్రాయానికి పంపామని, లా డిపార్ట్మెంట్ నుంచి అభిప్రాయం అందిన వెంటనే ఈ అంశాన్ని ట్రైబ్యునల్కు సిఫారసు చేయనున్నట్లు జలశక్తి కార్యదర్శి పేర్కొన్నారు. గోదావరి నదిపై సీతారామ ఎల్ఐఎస్, సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ (తుపాకులగూడెం ప్రాజెక్ట్), ముక్తేశ్వరం (చిన్న కాళేశ్వరం) ఎల్ఐఎస్, చౌట్పల్లి హనుమంతరెడ్డి ఎల్ఐఎస్, మోడికుంటవాగు ప్రాజెక్టు, చనాక-కొరాట బ్యారేజీకి సంబంధించిన ఆరు సవివర ప్రాజెక్టు నివేదికలను (DPR) అనుమతుల కోసం సెప్టెంబర్లో ప్రభుత్వం అందజేసిందని, కేంద్ర జలసంఘం వద్ద పెండింగ్లో ఉందని సీఎస్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల ప్రతిపాదనలను పరిశీలించి త్వరలోనే అనుమతులు ఇస్తామని జలశక్తి కార్యదర్శి హామీ ఇచ్చారు.
గోదావరి బేసిన్లోని మరో ఐదు ప్రాజెక్టులు – రామప్ప-పాకాల లింక్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ (రోజుకు అదనపు 1 టీఎంసీ), కందకుర్తి ఎల్ఐ స్కీమ్, గూడెం ఎల్ఐఎస్, పీవీ నర్సింహారావు కంతనపల్లి బ్యారేజీ ప్రాజెక్టులను, అనాథరైజ్డ్ ప్రాజెక్టుల జాబితాలో తప్పుగా చేర్చడం జరిగిందన్నారు. గోదావరీ నదీ యాజమాన్య బోర్డు జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ నుంచి ఈ ఐదు ప్రాజెక్టులను అనాథరైజ్డ్ ప్రాజెక్ట్ల జాబితా నుంచి తొలగించాలని సీఎస్ కోరారు. గోదావరి నదిపై నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ, ఏపీ మధ్య పెద్దగా సమస్యలు, ఉమ్మడి ప్రాజెక్టులు లేనందున, ప్రత్యేకంగా గోదావరి రివర్ మేనేజింగ్ బోర్డు అవసరం లేదని సీఎస్ సోమేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ చేపట్టిన అక్రమ నీటిపారుదల ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తామని కేంద్ర జలశక్తి కార్యదర్శి పంకజ్ కుమార్ హామీ ఇచ్చారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, జాయింట్ సెక్రెటరీ సంజయ్ అవస్తీ, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఇరిగేషన్ (జనరల్) ఈఎన్సీ మురళీధర్, ఈఎన్సీ గజ్వేల్ శ్రీహరిరామ్, సీఎం కార్యాలయ ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే పాల్గొన్నారు.