హైదరాబాద్, నవంబర్29 (నమస్తే తెలంగాణ): చనాక-కొరాట (ఆదిలాబాద్ జిల్లా), ముక్తీశ్వర (చిన్నకాళేశ్వరం) భూపాలపల్లి జిల్లా, చౌటుపల్లి హన్మంత్రెడ్డి నిజామాబాద్ జిల్లా ఎత్తిపోతల పథకాలకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నుంచి తుది అనుమతులు లభించాయి. ఢిల్లీ శ్రమశక్తిభవన్లో కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ సెక్రటరీ పంకజ్కుమార్ అధ్యక్షతన మంగళవారం కొనసాగిన టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ వీటికి ఆమోదం తెలిపింది. జూలై 2021లో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన రివర్ బోర్డుల గెజిట్ను అనుసరించి అనుమతులు లేని ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు పొందాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆయా ప్రాజెక్టుల డీపీఆర్లను అదే ఏడాది సెప్టెంబర్లో కేంద్ర జలసంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించింది. కేంద్ర జలసంఘంలో భాగమైన వివిధ డైరెక్టరేట్లు డీపీఆర్లను కూలంకషంగా పరిశీలించి ఆమోదం తెలిపాయి.
గెజిట్ను అనుసరించి డీపీఆర్లను పరిశీలించేందుకు గోదావరి రివర్మేనేజ్మెంట్ బోర్డుకు పంపగా, గత ఏప్రిల్లో జరిగిన 13వ బోర్డు మీటింగ్లో వాటిపై చర్చించారు. ఏపీ ప్రభు త్వం డీపీఆర్లకు అనుమతులివ్వడాన్ని వ్యతిరేకించినా, బోర్డు మాత్రం తన రిమార్కులతో సీడబ్ల్యూసీకి పంపింది. ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ పునఃసమీక్షించిన కేంద్ర జలసంఘం అవన్నీ అసత్యమని భావించడంతోపాటు, తెలంగాణకు చెందిన ఆ మూడు ప్రాజెక్టులకు టెక్నో ఎకనమిక్ క్లియరెన్స్(టీఏసీ) ఇవ్వవచ్చని కేంద్ర జల్శక్తిశాఖకు సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో టీఏసీ మంగళవారం సమావేశమై తెలంగాణ ప్రాజెక్టులపై చర్చించింది. కమి టీ సభ్యులు లేవనెత్తిన అన్ని సందేహాలకు, సంధించిన ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు పక్కా సమాచారంతోకూడిన సమాధానాలను ఇచ్చారు. వాటితో సంతృప్తి చెందిన టీఏసీ చైర్మన్ పంకజ్కుమార్ మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే మినిట్స్ జారీచేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. టీఏసీ చైర్మన్ పంకజ్కుమార్, సభ్యులకు తెలంగాణ తరపున రాష్ట్ర సా గు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జల్శక్తి మంత్రిత్వశాఖ అడిషనల్ సెక్రటరీ దేబశ్రీ ముఖర్జీ, సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్కే గుప్తా, సభ్యులు చంద్రశేఖర్ అయ్యర్, రుష్విందర్ వోర, చీఫ్ ఇంజినీర్లు పైథాంకర్, బీపీ పాండే, వివిధ విభాగాల డైరెక్టర్లు, ఆర్థిక, వ్యవసాయ, ఇంధన మంత్రిత్వశాఖల ప్రతినిధులు, తెలంగాణ నుంచి రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీలు మురళీధర్, ఎన్ వెంకటేశ్వర్లు, సీఈలు శ్రీనివాస్, మధుసూదన్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు.
ఫలించిన తెలంగాణ కృషి..
మూడు ప్రాజెక్టులకు అన్ని అనుమతులను సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆది నుంచీ క్షేత్రస్థాయి అధ్యయనాలతో పకడ్బందీ ప్రణాళికలతో ముందుకుసాగింది. తెలంగాణ సర్కారు అవిశ్రాంత కృషికి ఇవాళ ఫలితం దక్కింది. వాస్తవంగా గోదావరి సబ్బేసిన్ జీ7లో పెన్గంగ నదిపై మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా ఘటాంజీ తాలుకాలోని తడనవాలి గ్రామం వద్ద 42.67 టీఎంసీల సామర్థ్యంతో లోయర్ పెన్గంగ డ్యామ్ నిర్మాణం చేపట్టాలి. దాని నుంచి వచ్చే కుడి కాలువ ద్వారా మహారాష్ట్ర నీటిని వినియోగించుకోవాలి. మొత్తంగా 89 కిలోమీటర్ల పొడవు ఉంటే ఎడమ కాలువ ద్వారా తెలంగాణ ప్రాంతంలో 47,520 ఎకరాలకు సాగునీరందించాలి. దశాబ్దాలుగా ఆ ప్రాజెక్టును మహారాష్ట్ర ముందుకు తీసుకుపోవడం లేదు. డ్యామ్ నిర్మాణం పూర్తి కావడం లేదు. లోయర్ పెన్గంగ ప్రాజెక్టు పేరిట ఉమ్మడి పాలకులు ఓట్లు దండుకున్నారు తప్ప చేసిందేమీ లేదు. స్వరాష్ట్రం ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పెన్గంగపై ప్రతిపాదించిన పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టిని సారించారు. పెన్గంగపై గతంలో ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో మరోసారి సమగ్రమైన ఒప్పందం చేసుకున్నారు.
లోయర్ పెన్గంగ ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ చనాకా కొరటా బరాజ్ నుంచి నీటిని వినియోగించుకునేందుకు మహారాష్ట్రను ఒప్పించారు. అక్కడితో ఆగకుండా ఒప్పందంలో భాగంగా నిర్మించాల్సిన చనాక-కొరాట బరాజ్ నిర్మాణానికి రూ.368 కోట్లతో, లోయర్ పెన్గంగ ప్రాజెక్టు పనులకు సంబంధించి రూ.1,227 కోట్లతో పరిపాలన అనుమతులను మంజూరుచేశారు. ఉమ్మడి పాలకులు నాలుగు దశాబ్దాలలో కూడా పూర్తి చేయలేని కలను సీఎం కేసీఆర్ ఆరేండ్లలో సాకారం చేశారు. చనాక-కొరాట బరాజ్ ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో ఉమ్మడిగానే పర్యావరణ అనుమతులు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ క్రమంలో ఒప్పందంలో పర్యావరణ అనుమతులకు సంబంధించి అన్ని ప్రక్రియలను పూర్తిచేయడంతోపాటు, తెలంగాణ ప్రభుత్వం బరాజ్ నిర్మాణం సైతం పూర్తి చేసింది. కానీ మహారాష్ట్ర మాత్రం ఒప్పందంలో భాగంగా తన పోర్షన్కు సంబంధించిన పనులకు ఇప్పటికీ కనీసం పరిపాలన అనుమతులను కూడా మంజూరుచేయలేదు. అదీగాక 0.5 హెక్టార్ల అటవీ భూమికి అనుమతులను కూడా తీసుకోవడం లేదు. దీంతో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పొందడానికి అవాంతరం ఎదురైంది. దీంతో మహారాష్ట్రతో సంబంధం లేకుండా తాము చేపట్టిన 80 శాతం పనులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని తెలంగాణ సర్కారు కేంద్రానికి విన్నవించింది.
నిజామాబాద్ జిల్లా శెట్పల్లి వద్ద నిర్మించిన చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పంప్హౌస్
మూడేండ్ల ప్రదక్షిణలకు మోక్షం
తెలంగాణ సాగునీటి పారుదలశాఖ మూడేండ్లుగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వచ్చింది. గతంలోనూ తెలంగాణ, మహారాష్ట్ర చేపట్టిన ఉమ్మడి ప్రాజెక్టులకు వేర్వేరుగా పర్యావరణ అనుమతులు మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయని, అందుకు లోయర్ పెన్గంగ ప్రాజెక్టే నిదర్శనమని అధికారులు సోదాహరణంగా వాదనలు వినిపించారు. తెలంగాణ వాదనలతో ఏకీభవించిన కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ ఎట్టకేలకు గత జూన్లో అనుమతులు మంజూరు చేసింది. దీంతో టీఏసీ ఆమోదానికి మార్గం ఏర్పడింది. టీఏసీ చనాక కొరాటకు తుది అనుమతులు చేయడం తెలంగాణ సర్కారు కృషి ఫలితమేనని ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.