TSPSC | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేయకపోయినా హాల్టికెట్ వచ్చిందంటూ ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్కు చెందిన జక్కుల సుచిత్ర టీఎస్పీఎస్సీకి క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలు జోరుగా ప్రచారం కావడంతో టీఎస్పీఎస్సీ ఖండించింది. టీఎస్పీఎస్సీ ఐడీ TS1201206420తో గ్రూప్-1కు దరఖాస్తు చేశారని, అక్టోబర్ 16న పరీక్ష కూడా రాశారని సెంటర్ కోడ్, నామినల్ రోల్లో సుచిత్ర సంతకం చేసిన వివరాలతో సహా టీఎస్పీఎస్సీ సోమవారం వెల్లడించింది. మంగళవారం సుచిత్ర స్పందించారు.
టీఎస్పీఎస్సీని బహిరంగ క్షమాపణలు కోరారు. ‘నేను గ్రూప్-1కు దరఖాస్తు చేశాను. గత అక్టోబర్లో పరీక్ష రాశాను. మా దగ్గరి బంధువులు నలుగురు చనిపోయారు. ఆ డిప్రెషన్ నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో అప్పుడు పరీక్ష రాసిన విషయం గుర్తులేదు. శనివారం హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ సమయంలోనే ఒక మీడియా సంస్థతో మాట్లాడాను. దాన్ని కొందరు బాగా వైరల్ చేస్తున్నారు. ఈ విషయంలో తప్పంతా నాదే.. టీఎస్పీఎస్సీని క్షమాపణలు కోరుతున్నాను’ అని తెలిపారు.