హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరులో కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఇటీవల జరిపిన పరిశోధనల్ల్లో జైనశిల్పాలు లభించాయి. ఇందులో జైనుల సర్వతోభద్ర శిల్పంతోపాటు మహావీరుని శిల్పం ఉన్నది. వీటిని బట్టి ఆకునూరు పూర్వం చారిత్రక నగరంగా వర్ధిల్లినట్టు బృందం సభ్యుడు శ్రీరామోజు హరగోపాల్ చెప్పారు. ‘ఆకునూరు బయట కోటిలింగాల గడ్డగా పిలువబడే పాటిగడ్డమీద ఐదడుగుల ఎత్తైన జైన చౌముఖి ఉన్నది. కొలనుపాక జైన సంగ్రహాలయంలో వేములవాడలో బౌద్ధుల ఉద్దేశిక స్థూపాలను పోలిన జైన చౌముఖి శిలలు కనిపించాయి. వీటినే జైనులు సర్వతోభద్ర అంటారు. ఈ శిల్పాలున్నచోట పూర్వం జైన ధర్మకేంద్రం ఉన్నట్టు భావించవచ్చు. ఈ జైన సర్వతోభద్ర శిలమీద నలువైపులా 24వ జైనతీర్థంకరుడు మహావీరుని శిల్పాలున్నాయి. శిల శిఖరాన రుషభునిమూర్తి నలువైపులా చెక్కి ఉన్నది. అక్కడే విరిగిపోయిన జైన మహావీరుని ధ్యానాసనశిల్పం ఉదరం నుంచి కిందిభాగం మిగిలి కనిపిస్తున్నది’ అని పేర్కొన్నారు. ఆకునూరులో రాష్ట్రకూట రాజప్రతినిధి శంకరగండరస కాలంలో వేయించిన శాసనం, హనుమకొండ పురవరాధీశ్వరుడు మహామండలేశ్వరుడు కాకతి రుద్రదేవుని కాలంలో ఏర్పరిచిన శాసనం గతంలో లభించినట్టు హరగోపాల్ తెలిపారు. తేదీలేని ఆకునూరు మొదటి శాసనం మహాసామంతాధిపతి, రట్టశూరరు, జయధీర, విట్టి నారాయణ, ధర్మ రత్నాకర బిరుదులున్న శంకర గండరస కొలనుపాకను పాలిస్తున్న సమయంలో ఆకునూరు పాలకుడు ఇందుపయ్య కొలిపాక జైన బసదికి ఇచ్చిన దానం, తవ్వించిన రట్ట సముద్రం చెరువు గురించి తెలియజేస్తున్నదని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా పరిశోధనలు జరుపుతున్న సందర్భంగా జైనుల శిల్పాలు లభించినట్టు ఆయన వెల్లడించారు.