హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని వార్ధా జిల్లా ఆర్వీ విధానసభ బీఆర్ఎస్ ఇన్చార్జి జైకుమార్ బేల్ఖడే బుధవారం రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ పేరుమీద సుమారు 5 వేల మంది రైతులకు అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ విధానాలను అక్కడి రైతులకు వివరించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమానికి ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే చరణ్ వాగ్మారే, రాజు తోడ్సే తదితరులు పాల్గొన్నారు.