హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): పారాచూట్ నేతలకు కాకుండా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. పార్టీ లో పలు విభాగాలకు అధ్యక్షులుగా ఉన్న నేతలకు తప్పనిసరిగా టికెట్లు ఇవ్వాలని, కొత్తవారికి టికెట్లు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యహరించాలని కోరారు.
ఈ మేరకు పలు పేర్లను సూచిస్తూ ఏఐసీసీ తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ మురళీధరన్కు లేఖ రాశారు. జగ్గారెడ్డి సూచించిన పేర్లలో పార్టీ వివిధ విభాగాల నేతలు మెట్టు సాయికుమార్, బల్మూరి వెంకట్, శివసేనారెడ్డి, నూతి శ్రీకాంత్గౌడ్, సునీతారావు, అన్వేష్రెడ్డి, నాగరి ప్రీతమ్, బెల్లయ్యనాయక్, అనిల్కుమార్యాదవ్, సోహైల్ఖాన్, జితేందర్, వీరయ్య, అజ్మతుల్లా హుస్సేన్ ఉన్నారు.