యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతాంగం రక్తంతో ఢిల్లీలో కప్పం కడుతూ కాంగ్రెస్ మంత్రులు తమ పదవులను కాపాడుకుంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని, కమలానికి ఓటేస్తే హస్తానికి వేసినట్టేనని తెలిపారు. 2019 ఎన్నికల్లో మాదిరి బీజేపీ బలమైన అభ్యర్థులున్న చోట కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను బరిలోకి దింపి సహకరిస్తున్నదని ఆరోపించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై కేసీఆర్, కేజ్రీవాల్ను రాజకీయాల్లో లేకుండా కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే ఒక్క మంత్రి కూడా మాట్లాడటం లేదని మండిపడ్డారు. వంద రోజుల్లో రెండు వందలమందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ర్టాన్ని పదేండ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలను జాతీయ పార్టీలు చేర్చుకొని టికెట్ ఇస్తున్నాయని, కాంగ్రెస్, బీజేపీకి సిగ్గుండాలని విమర్శించారు. రేవంత్రెడ్డి తన సీఎం కుర్చీకి ఎసరు వస్తుందని, ముందస్తుగా తన వర్గం నేతలను చేర్చుకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్రెడ్డి, చెరుకు సుధాకర్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.