సూర్యాపేట: తెలుగు ప్రజలతోపాటు మన చుట్టూ ఉన్న తమిళ, కన్నడ ప్రజలు, రైతులు జరుపుకునే పండుగ సంక్రాంతి అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy ) అన్నారు. సూర్యాపేట పట్టణంలోని పలు వార్డుల్లో భోగి సంబురాల్లో పాల్గొన్న ఆయన సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. ప్రజలతో కలిసి భోగి మంటల చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. చిన్నారులకు గాలిపటాలు బహూకరించారు. అనంతరం మాట్లాడుతూ.. చేతికి వచ్చిన పంటలను ఆహార ధాన్యాలుగా మార్చుకునే గొప్ప పండుగ సంక్రాంతి అన్నారు.
చెడు ఆలోచనలు, పీడలు అన్ని భోగిమంటల్లో కలిసిపోవాలని చెప్పారు. మళ్లీ పంటలు వేసే ప్రయత్నంలో ఉన్న రైతన్నలకు అన్నీ శుభాలే జరగాలని ఆకాంక్షించారు. పంటలు బాగా పండాలని, ప్రభుత్వ సహకారం ప్రజలకు సరైన రీతిలో అందాలని కోరుకున్నారు. సూర్యాపేట నియోజకవర్గంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.