మునుగోడు, జూలై 28: టీఆర్ఎస్ ప్రభుత్వంపై, తనపై పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని హెచ్చరించారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లా మునుగోడులో టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పదివేల మందితో అడ్డుకుంటామని ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ప్రగల్భాలు పలికారని, చివరికి కనీసం పది మందిని కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. నల్లగొండ జిల్లాను వైఎస్ రాజశేఖర్రెడ్డికి తాకట్టు పెట్టిన దొంగలు కోమటిరెడ్డి సోదరులని, కృష్ణా నీటిలో జిల్లా వాటాను వైఎస్కు అమ్ముకొని రైతుల ఉసురు పోసుకున్నారని ఘాటుగా విమర్శించారు. కనీసం నియోజకవర్గానికే రాకుండా ప్రొటోకాల్ అంటూ రాజగోపాల్రెడ్డి సాకు లు చెప్పడం సరికాదని, మునుగోడు కార్యక్రమానికి ఆయనను 4 రోజుల ముందే ఆహ్వానించినా రాలేదని తెలిపారు. చౌటుప్పల్లో స్థానిక ప్రజాప్రతినిధుల కంటే ముందే రాజగోపాల్రెడ్డి మాట్లాడి ప్రొటోకాల్ను ఉల్లంఘించారని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.