పెన్పహాడ్/నల్లగొండ, జూన్ 23 : రైతులు ఎకరానికి లక్ష రూపాయలు ఆర్జించాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని మొర్సకుంటతండా, మెగ్యాతండాలో గురువారం జరిగిన శుభకార్యాలకు హాజరైన మంత్రి.. అక్కడి గిరిజన రైతులతో కాసేపు ముచ్చటించారు. ఈ వానకాలంలో ఏయే పంటలు వేస్తున్నారని అడగ్గా.. ఎక్కువ మంది రైతులు వరి అని చెప్పారు. దీంతో వరి, వాణిజ్య, కూరగాయల పంటల సాగు వల్ల కలిగే లాభ నష్టాలను పోల్చి చెప్పి అవగాహన కల్పించారు.
ఎప్పుడూ వరి వేసి భూమిని పాడు చేసుకోవద్దని సూచించారు. చివరి దశలో వచ్చే తెగుళ్ల ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్టు చెప్పారు. పంట మార్పిడి పద్ధతితో మంచి దిగుబడులు పొం దవచ్చన్నారు. రైతులు తమ భూముల్లో ఒకే పంటను సాగు చేయకుండా మినుము, పెసర, కంది, వేరుశనగ, కుసుమ, నువ్వులు, కూరగాయలు వంటి పంటలు సాగు చేయాలని సూచించారు. ఒక పంటలో నష్టం వచ్చినా, మరో పంటలో లాభం పొందవచ్చని తెలిపారు. అనంతరం నల్లగొండ మండలం నర్సింగ్భట్లలో నర్సింహ అనే రైతు రెండు ఎకరాల్లో సాగు చేసిన ఖర్జూర పంటను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎకరా భూమిలో 60 మొక్కల దాకా వేస్తే ఖర్జూర దిగుబడి 12 టన్నులు వస్తుందని, రూ.4 లక్షల ఆదాయం పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు.