హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): వేతన సవరణల్లో ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని కార్మిక జేఏసీ నేతలు మండిపడ్డారు. సమ్మె విరమణ హామీల్లో భాగంగా ప్రభుత్వం ఇస్తామన్న 11శాతం ఫిట్మెంట్, వేతన సవరణ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల గురించి తాజాగా ఇచ్చిన సర్క్యులర్లో ఎక్కడా ప్రస్తావించకపోవడంతో వారు మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొన్నారు. అనంతరం సర్క్యులర్ లోపాలను సవరించుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన ఆదేశాలలో 2021 వేతన సవరణ బకాయిల గురించి ఎకడా పొందుపరచలేదని, అలాగే రిటైరైన ఉద్యోగులకు 2017 వేతన సవరణకు సంబంధించిన బకాయిల చెల్లింపు గురించి, 2021 వేతన సవరణ బకాయిల గురించి చెప్పకపోవడం కార్మికులను అసంతృప్తికి గురి చేసిందని పేర్కొన్నారు. ఉద్యోగుల స్పెషల్ గ్రేడ్స్లో ఏమాత్రం మార్పు లేకపోవడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. ఈ స్పెషల్ గ్రేడ్స్ 12/20 సంవత్సరాలకు సవరించాల్సిన అవసరం ఉందన్నారు.
కార్మికులను పట్టించుకోకుండా అధికారులకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ సీమ్ అమలు జరుపడం ఏకపక్ష నిర్ణయంగా భావిస్తున్నట్టు జేఏసీ నేతలు తెలిపారు. సూపర్వైజర్లు, ఆఫీసర్లకు గ్రేడ్పేను బేసిక్లో కలుపడం అన్యాయమని చెప్పారు. ఈనెల 21న యాజమాన్యంతో జేఏసీ జరిపిన చర్చల్లో 80 శాతం అలవెన్సులు పెంచడానికి అంగీకరించారని, కానీ సర్యులర్లో ఆ విషయం ఎక్కడా లేదన్నారు.
సూపర్ వైజర్, అధికారుల గ్రేడ్పేను పూర్తిగా తీసివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అధికారులకు కెరీర్ అడ్వాన్స్మెంట్ సీమ్ అమలు పరిచిన విధంగానే ఆర్టీసీ ఉద్యోగులకు స్పెషల్ గ్రేడ్ స్థానంలో ఈ సీమ్ను అమలు చేయాలని కోరారు. 2017 నుంచి నేటి వరకు టైపిస్ట్ల స్పెషల్పేలో మార్పు చేయలేదు కనుక వారి స్పెషల్ పేను బేసిక్లో మెర్జ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇవే అంశాలపై ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాబు మంగళవారం ఓ ప్రకటనలో ఆర్టీసీ తీరును ఎండగట్టారు.