హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రజావ్యతిరేక విద్యుత్తు సవరణ బిల్లు-2022ను ఉపసంహరించుకుంటామని విస్పష్టంగా ప్రకటించిన తర్వాతే తెలంగాణ గడ్డపై కాలుమోపాలని ప్రధాని మోదీని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. శనివారం రామగుండానికి వస్తున్న ప్రధాని పర్యటనను నిరసిస్తూ.. టీఈఈ జేఏసీ శుక్రవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. 75 ఏండ్లుగా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించుకున్న విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, ట్రాన్స్మిషన్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను కొన్ని కార్పొరేట్ శక్తులకు నామమాత్రపు విలువకు కట్టబెట్టే కుట్రలను ఇకనైనా మానుకోవాలని జేఏసీ కన్వీనర్ ఎన్ శివాజీ, చైర్మన్ కోడూరి ప్రకాశ్ పేర్కొన్నారు.
ఈ బిల్లుతో దేశంలోని పేద వినియోగదారులు, రైతులు, గ్రామీణ ప్రజలు కనీస అవసరమైన విద్యుత్తుకు దూరం కానున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ రంగంలోని డిస్కంలను నస్టాల ఊబిలోకి నెట్టివేసే భారీ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని హెచ్చరించారు. ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ప్రైవేటు రంగంలో ఉన్న విద్యుత్తు సంస్థలను తిరిగి జాతీయీకరణ దిశగా తీసుకువెళ్తున్నాయని, యూరప్ పరిణామాలను గుణపాఠంగా తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. సవరణ బిల్లును మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే.. దేశవ్యాప్త సమ్మెకు సైతం వెనుకాడబోమని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో నాసర్ షరీఫ్, రామేశ్వరయ్య శెట్టి, తుల్జారాంసింగ్, ఆరోగ్యరాణి, కరెంటురావు, రాములు, గణేశ్రావు, రమేశ్, తిరుపతయ్య, మాతంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.