TS Weather Update | హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ద్రోణి ప్రభావం కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ. ఎత్తున ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నదన్న అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మంగళవారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడ్డాయి.