Heavy Rains | హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, జనగామ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఈ మేరకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.